కేరళను వణికిస్తున్న నిఫా వైరస్ 

కేరళలో నిఫా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో వ్యక్తికి ఈ వైరస్ నిర్దారణ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా ధ్రువీకరించారు. కోజికోడ్‌‌లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలోని ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో నిఫా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. బాధితులతో కాంటాక్ట్ అయిన 706 మందిని ఇప్పటి వరకూ గుర్తించారు. వీరిలో 77 మంది హై-రిస్క్ కేటగిరీలో ఉండగా.. 153 మంది హెల్త్ […]

Share:

కేరళలో నిఫా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో వ్యక్తికి ఈ వైరస్ నిర్దారణ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తాజాగా ధ్రువీకరించారు. కోజికోడ్‌‌లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలోని ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో నిఫా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. బాధితులతో కాంటాక్ట్ అయిన 706 మందిని ఇప్పటి వరకూ గుర్తించారు. వీరిలో 77 మంది హై-రిస్క్ కేటగిరీలో ఉండగా.. 153 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. హై-రిస్క్ కేటగిరీలో ఉన్నవారిలో ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 13 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నారని, వీరికి తలనొప్పి వంటి స్వల్ప లక్షణాలున్నాయని చెప్పారు. హై-రిస్క్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు మాత్రం ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.

కాగా, వైరస్ నియంత్రణకు చేపట్టిన చర్యలను సమన్వయం కోసం కేరళ ప్రభుత్వం 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌లో ఉన్న వారికి నిత్యావసరాలను అందించడంలో సహాయపడేందుకు స్థానిక ప్రభుత్వం ద్వారా వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ కేరళలో నిపా వైరస్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కోజికోడ్‌ జిల్లాలోని 7 పంచాయతీలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, పాఠశాలతోపాటు ఇతర విద్యాసంస్థలను మూసివేశారు. ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్‌ బంగ్లాదేశ్‌ వేరియంట్‌ అని కేరళ ప్రభుత్వం వెల్లడించింది.

కంటెయిన్‌మెంట్ జోన్లలోని విద్యార్థులకు ఆన్‌‌లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి వి శివన్‌కుట్టీ ఆదేశించారు. ఇది మనుషుల మధ్య వ్యాపించగలదని, వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని చెప్పారు. మరణాల రేటు అధికంగా ఉండే ఈ వైరస్‌ నిర్ధారణను వేగవంతంగా చేపట్టేందుకు గాను పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నిపుణులు కేరళకు చేరుకున్నారు.

నిఫా వైరస్ అంటే ఏమిటి?

నిపా వైరస్ అనేది జూనోటిక్ వైరస్.. జంతువుల నుంచి (గబ్బిలాలు లేదా పందులు వంటివి) మానవులకు వ్యాపిస్తుంది. ఇది కలుషితమైన ఆహారం ద్వారా లేదా నేరుగా వ్యక్తుల మధ్య కూడా వ్యాపిస్తుంది. టెరోపోడిడే కుటుంబానికి చెందిన ఫ్రూట్ బ్యాట్స్ (గబ్బిలాలు) నిపా వైరస్‌కు సహజ అతిథేయులు.

నిఫా వైరస్ లక్షణాలు

నిపా వైరస్ బాధితుల్లో తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం, ప్రాణాంతక ఎన్సెఫాలిటిస్ వంటి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. ఈ వైరస్ పందుల వంటి జంతువులలో కూడా తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఈ వైరస్ సోకిన వ్యక్తులకు మొదట్లో జ్వరం, తలనొప్పి, మైయాల్జియా (కండరాల నొప్పి), వాంతులు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత మైకం, స్పృహకోల్పోవడం, తీవ్రమైన ఎన్సెఫాలిటిస్‌ను సూచించే నరాల సంకేతాలు బయటపడతాయి.

కొంతమందికి న్యుమోనియా, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. ఎన్సెఫాలిటిస్, మూర్ఛ తీవ్రమైన సందర్భాల్లో సంభవిస్తాయి. దీని వల్ల 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లిపోతారు.

నిఫా వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్

WHO ప్రకారం.. ఇంక్యుబేషన్ పీరియడ్ (లక్షణాలు బయటపడటానికి) 4 నుంచి 14 రోజుల వరకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది 45 రోజుల కూడా పడుతుంది. తీవ్రమైన ఎన్సెఫాలిటిస్‌కు గురైన బాధితులు సరైన చికిత్సతో పూర్తిగా కోలుకుంటారు. కానీ, వీరికి దీర్ఘకాలిక నరాల సంబంధిత సమస్యలు వెంటాడుతాయి. దాదాపు 20% మంది రోగులు మూర్ఛ, వ్యక్తిత్వ మార్పులు వంటి అవశేష నాడీ సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోలుకున్న కొద్దిమంది వ్యక్తులకు మళ్లీ ఎన్సెఫాలిటిస్‌ తిరగబెట్టే ప్రమాదం ఉంది. దీని మరణాల రేటు 40% నుంచి 75% వరకు అంచనా వేశారు. అంటువ్యాధి నియంత్రణం, నిఘా, క్లినికల్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను బట్టి ఈ రేటు వ్యాప్తిలో మార్పులు ఉంటాయి.

వ్యాధిని ఎలా చికిత్స చేయవచ్చు?

నిఫా వైరస్‌ను నయం చేయడానికి ప్రస్తుతం వ్యాక్సిన్ లేదా మందులు లేవు. ఎవరైనా నిఫా వైరస్‌తో అస్వస్థతకు గురైతే, వారిని ప్రత్యేక ఆసుపత్రి యూనిట్‌లో ఉంచడం చాలా ముఖ్యం, అక్కడ వారు అదనపు సంరక్షణను పొందవచ్చు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులు లేదా వైరస్ కలిగి ఉన్న వ్యక్తులు వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇతరులకు దూరంగా ఉండాలి. ఇది ప్రతి ఒక్కరినీ అనారోగ్యం బారిన పడకుండా కాపాడుతుంది.