హైదరాబాద్‍లో సీడబ్లూసీ భేటీ…

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్లూసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోని తాజ్ హోటల్ కి చేరుకున్నారు. రెండు రోజుల కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలలో భాగంగా తొలి రోజు సమావేశం తాజ్‌కృష్ణా హోటల్‌లో శనివారం ప్రారంభమైంది.  అంతకుముందు సీడబ్లూసీ సమావేశ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్లూసీ సభ్యులు, […]

Share:

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీడబ్లూసీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హైదరాబాద్ లోని తాజ్ హోటల్ కి చేరుకున్నారు. రెండు రోజుల కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశాలలో భాగంగా తొలి రోజు సమావేశం తాజ్‌కృష్ణా హోటల్‌లో శనివారం ప్రారంభమైంది. 

అంతకుముందు సీడబ్లూసీ సమావేశ ప్రారంభానికి ముందు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీడబ్లూసీ సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరవుతున్న కాంగ్రెస్ అగ్రనేతలకు కళాకారులు తమ నృత్యాలతో స్వాగతం పలికారు. కాంగ్రెస్ అగ్ర నేతల రాక సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో భారీ భధ్రతను ఏర్పాటు చేశారు. సీఆర్​పీఎఫ్ పోలీసులతో పాటు, రాష్ట్ర పోలీసులు భారీగా మోహరించారు.

అగ్రనేతలకు ఘన స్వాగతం

కాంగ్రెస్ కీలక నేతలంతా హైదరాబాద్ కు చేరుకోవడంతో పార్టీ నేతల్లో జోష్ కనిపిస్తోంది. కొందరు ముఖ్య నాయకులు శుక్రవారం హైదరాబాద్ కు చేరుకోగా, మరికొందరు నతేలు శనివారం ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారిలో సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉన్నారు. వారు ఎయిర్ పోర్ట్ నుంచి తాజ్ కృష్ణా హోటల్ కు చేరుకున్నారు.

ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిదంబరం, వీరప్ప మొయిలీ తదితరులు అప్పటికే తాజ్ హోటల్ చేరుకున్నారు.

కాగా, సెప్టెంబర్ 16, 17 తేదీల్లో హైదరాబాద్‌ వేదికగా హోటల్ తాజ్ కృష్ణ లో కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సోనియా గాంధీ ఆప్యాయంగా పలకరించారు. ఎంపీ వెంకట్ రెడ్డికి జరిగిన చిన్న కాలు ప్రమాదం గురించి అడిగి తెలుకొని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన  సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్‌ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించింది. సమావేశంతో రాష్ట్ర కాంగ్రెస్ లో జోష్ వస్తుందని వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఈ సమావేశాలు ప్లస్ పాయింట్ అవుతాయని హస్తం పార్టీ నేతలు భావిస్తున్నారు.

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొన్నారు. శనివారం ఉదయం బీఆర్ఎస్‌ పార్టీకి తుమ్మల రాజీనామా చేశారు.  

సిడబ్ల్యూసిలో 39 మంది సాధారణ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు మరియు 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. వీరిలో 15 మంది మహిళలు మరియు సాధారణ సభ్యులలో శశి థరూర్, సచిన్ పైలట్ మరియు గౌరవ్ గొగోయ్ వంటి అనేక మంది ఉన్నారు. 

ఎన్నికలే టార్గెట్‍

సమావేశాల్లో ప్రారంభోపన్యాసం చేసిన ఖర్గే.. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దేశంలో తక్షణం కులగణనతో కూడిన జనాభా లెక్కింపు ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా అణచివేతకు గురైన వర్గాలకు విద్య, వైద్యం, ఉపాధి, ఆహార భద్రతకు భరోసా కల్పించాలని కోరారు. ఇండియా కూటమిలో 27 పార్టీలు ప్రాథమికమైన అంశాల్లో కలిసి సాగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన మూడు సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వ.. ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై పోరాటం సాగించాలని నిర్ణయించినట్లు వివరించారు. 

14 తీర్మానాలకు ఆమోదం..

హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశంలో.. 14 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. కశ్మీర్ లో చనిపోయిన బలగాల కుటుంబాలకు సంతాపం, ఖర్గే సేవలకు, అలుపెరుగని రాజకీయ పోరాటానికి ప్రశంసలు, భారత్ జోడో యాత్ర వార్షికోత్సవం సందర్భంగా ఆ స్ఫూర్తిని కొనసాగించాలని నిర్ణయం, మణిపూర్ లో వ్యవస్థల వైఫల్యంపై ఖండన. అలాగే కులతత్వం, మతత్వం, ప్రాంతీయవాదాలు ఉండొద్దన్న మోదీ మాటలపై ఫైర్ అయ్యారు.

 కనీస మద్దతు ధర సహా రైతులకు ఇచ్చిన హామీలు తప్పారని తీర్మానం, పెరుగుతున్న నిరుద్యోగంపై ఆందోళన, కొత్త రాజ్యాంగం, మౌలిక నిర్మాణాన్ని మార్చే ప్రయత్నాలకు వ్యతిరేకం. అలాగే పార్లమెంటు చర్చలు, నియంత్రణలు వదిలి, దీర్ఘకాల ప్రభావం ఉండే నిర్ణయాలను హడావుడిగా తీసుకుంటున్న తీరును ఖండిస్తూ తీర్మానం చేశారు. అంశాలు సూచించిన సోనియాకు అభినందన అలాగే ఆదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఫెడరల్ పై దాడి, విపక్ష రాష్ట్రాలకు డిజాస్టర్ నిధులు ఇవ్వకపోవడంపై ఆగ్రహం. అలాగే చైనా ఆక్రమణలపై ఖండన.. కేంద్రం ధీటుగా వ్యవహరించాలని డిమాండ్. ఇక దేశంలో మత, కుల, వర్గ సామరస్య వాతావరణాన్ని నిలబెట్టాలి.. ఈ విషయంలో ప్రజలకు అండగా ఉంటాం. అలాగే విభజన రాజకీయలను వ్యతిరేకిస్తూ సిద్ధాంత, ఎన్నికల విషయాలు సాధించడానికి ఇండియా కూటమి కట్టుబడి ఉందనే 14 తీర్మాలను సీడబ్ల్యూసీ ఆమోదించింది.

ఎన్నికల హామీలను ప్రకటించనున్న సోనియా..

మరోవైపు ఇవాళ (ఆదివారం) తుక్కుగూడలో కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి సభను భారీ ఎత్తున నిర్వహిస్తుంది. సాయంత్రం 6 గంటలకు బహిరంగ సభలో సోనియాగాంధీ 6 ఎన్నికల హామీలను ప్రకటించనున్నారు. ఈ సభకు సోనియాగాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, సీఎల్పీ నేతలు హాజరవుతున్నారు. ఈ సభకు సుమారు 10 లక్షల మందిని సేకరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే తుక్కుగూడ ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి సభా ప్రాంగణం వరకు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా కాంగ్రెస్‌ జెండాలు రెపరెపలాడుతున్నాయి.