CM Jagan బ్యాటింగ్, బైరెడ్డి బౌలింగ్.. మొదలైన "ఆడుదాం ఆంధ్ర" మెగా టోర్నీ

Adudham Andhra: రాష్ట్రంలో క్రీడల్లో ప్రతిభ కలిగిన ఆణిముత్యాలను ప్రోత్సహించి పై స్థాయికి పంపడమే "ఆడుదాం ఆంధ్ర" మెగా టోర్నీ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ అయిన 'ఆడుదాం ఆంధ్ర'ను గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌ లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు.

Courtesy: x

Share:

గుంటూరు: రాష్ట్రంలో క్రీడల్లో  ప్రతిభ కలిగిన ఆణిముత్యాలను ప్రోత్సహించి పై స్థాయికి పంపడమే "ఆడుదాం ఆంధ్ర" మెగా టోర్నీ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద మెగా టోర్నీ అయిన 'ఆడుదాం ఆంధ్ర'ను  గుంటూరు జిల్లా నల్లపాడులోని లయోలా పబ్లిక్‌ స్కూల్‌ లో సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయని సీఎం జగన్ అన్నారు. టోర్నీ ప్రారంభానికి ముందు క్రీడాకారులకు కిట్లను జగన్ పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగించారు.  "మొదలవుతున్న ఈ క్రీడా సంబరాలు దేశ చరిత్రలోనే ఒకమైలు రాయిగా నిలుస్తాయని చెప్పడానికి గర్వపడుతున్నా. ఈరోజు నుంచి జరిగే ఈ కార్యక్రమం మరో 47 రోజులపాటు ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఊరూరా పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఇవి అందరూ పాల్గొనే ఒక గొప్ప పండుగగా చరిత్రలో నిలుస్తుంది" అని సీఎం జగన్ అన్నారు.

ఆడుదాం.. ఆంధ్రా ప్రధాన ఉద్దేశమిదే:
ఆడుదాం.. ఆంధ్రా కార్యక్రమం వెనుక మన ప్రభుత్వానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఉన్నాయని సీఎం జగన్‌ చెప్పారు. గ్రామస్థాయిలోని ఆణిముత్యాలను వెలికితీసి వారిని ప్రపంచానికి పరిచయం చేయడం ఒకటైతే.. వ్యాయామం, క్రీడల వల్ల అనారోగ్య సమస్యలు దూరం చేసి ఆరోగ్య ఆంధ్రను నెలకొల్పడం రెండో ఉద్దేశమని సీఎం జగన్‌ చెప్పారు. ఈ రెండు ప్రధానమైన ఉద్దేశాలను సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం వివరించారు. "ప్రతి ఊరులోనూ జరిగే ఈ కార్యక్రమం ద్వారా వ్యాయామం, క్రీడల వల్ల ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా ఎంతమేలు జరుగుతుంది. ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మన జీవితాల్లో క్రీడలు ఎంత అవసరమో తెలియజేసేందుకు ఒక ప్రొగ్రాంలా ఇది ఉపయోగపడుతుంది" అని సీఎం జగన్ పేర్కొన్నారు. 

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బీపీ కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతామని, టైప్‌–2 డయాబెటీస్‌ నిరోధించడంలో క్రీడలు క్రియాశీలకంగా పనిచేస్తాయని సీఎం తెలిపారు. విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు ద్వారా గ్రామస్థాయిలో ప్రివెంటీవ్‌కేర్‌ మీద దేశం మొత్తం గర్వపడేలా మన రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగా వ్యాయామం ఎంత అవసరమో అనేది కూడా గ్రామస్థాయిలోకి ఒక సందేశం తీసుకెళ్లే గొప్ప కార్యక్రమం ఇదని వివరించారు. 

గ్రామీణ ఆణిముత్యాలను దేశానికి అందిస్తాం
క్రీడలు సచివాలయం స్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాల్లోని ఆణిముత్యాలను వెతకడం, వారిని సానబట్టి ఆ ఆణిముత్యాన్ని వజ్రంగా మలిచి దేశానికి పరిచయం చేయడం ఇంకో ముఖ్య ఉద్దేశమని వివరించారు. "ఈ కార్యక్రమంలో ఆణిముత్యాలను వెతికేందుకు ప్రొఫెషనల్‌ లీగ్‌లో ఉన్న టీమ్స్‌ అన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, సహాయంగా ఉంటాయి. ప్రతిభ కలిగిన వారిని ఆణిముత్యాలుగా మలిచే కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు టీమ్‌లు ముందుకు వచ్చాయి"అని సీఎం తెలిపారు. క్రికెట్‌కు సంబంధించి చెన్నై సూపర్‌ కింగ్స్, ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ముందుకు వచ్చాయని, నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్లంతా మనం ఆడేఆటను చూసేందుకు వస్తారని, ఆణిముత్యాలను వెతికి, వారికి మెరుగులు దిద్ది అంతర్జాతీయ, జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఈటీమ్స్‌ తోడుగా ఉంటారని తెలిపారు. 

శ్రీకాంత్, పీవీ సింధుల ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ అకాడమీల ఏర్పాటు:
బ్యాడ్మింటన్‌కు సంబంధించి శ్రీకాంత్, పీవీ సింధు భాగస్వాములు అవుతున్నారని చెప్పారు. బ్యాడ్మింటన్‌ అకాడమీ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా వీరికి సహకరిస్తుందని, శ్రీకాంత్, సింధు మెంటార్లుగా వ్యవహరిస్తారని, ప్రతిభ కలిగిన మన పిల్లలకు వీరు తోడుగా నిలుస్తారని తెలిపారు. వాలీబాల్‌కు సంబంధించి ప్రైమ్‌ వాలీబాల్, కబడ్డీకి సంబంధించి ప్రోకబడ్డీ ఆర్గనైజర్లు ముందుకు వచ్చారని, వీరంతా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారని, టాలెంట్‌ హంట్‌లో భాగస్వాములు అవుతారని తెలిపారు. సచివాలయ స్థాయి నుంచి కిట్లు పంపిణీ చేస్తున్నామని, సచివాలయ స్థాయి, మండల స్థాయి నుంచి గెలిచిన వారికి నియోజకవర్గ స్థాయిలో ఆడేందుకు ప్రొఫెషనల్‌ కిట్లు పంపిణీ జరుగుతుందని సీఎం వివరించారు. మనం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని. ప్రతి ఏటా కిట్లు ఇస్తూ.. మన పిల్లలను ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతుందని సీఎం ఆనందం వ్యక్తం చేశారు. 

9000 గ్రౌండ్లు సిద్దం:
రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా 34.19 లక్షల మంది క్రీడాకారులు "ఆడుదాం ఆంధ్ర"లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని సీఎం జగన్ తెలిపారు. 88.66 లక్షల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్‌ చేయడానికి ముందుకువచ్చారని, దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 1.22 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని ఆడుదాం ఆంధ్రాకు ఈరోజు నుంచి శ్రీకారం చుడుతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమం కోసం దాదాపుగా 15,000 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 9000 ప్లే గ్రౌండ్లు గుర్తించి సిద్ధం చేశామని తెలిపారు.