అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే..!

సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన తర్వాత మన హీరోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. వీరిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్స్ ఎవరంటే.. ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ కొనసాగుతోందని అనడంలో సందేహం లేదు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ పుణ్యమా అని, మన చిత్రాలకు ఇప్పుడు నార్త్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో పలువురు స్టార్స్ పాన్ ఇండియా […]

Share:

సౌత్ మూవీస్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన తర్వాత మన హీరోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీనికి తగ్గట్టుగానే భారీ పారితోషికాలు అందుకుంటున్నారు. వీరిలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న స్టార్స్ ఎవరంటే..

ప్రస్తుతం బాలీవుడ్ పై సౌత్ ఇండస్ట్రీ డామినేషన్ కొనసాగుతోందని అనడంలో సందేహం లేదు. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ పుణ్యమా అని, మన చిత్రాలకు ఇప్పుడు నార్త్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. దీంతో పలువురు స్టార్స్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంటున్నారు. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ సైతం ఇప్పుడు మన హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. 

ఈ నేపథ్యంలో సౌత్ స్టార్స్ రెమ్యునరేషన్స్ భారీగా పెరిగిపోతున్నాయి. రిజల్ట్ తో సంబంధం లేకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి రేట్ పలుకుతుండటంతో, పారితోషికం విషయంలో మన హీరోలు ఏమాత్రం తగ్గడం లేదు. వీరిలో కొందరు బాలీవుడ్ స్టార్స్ కంటే చాలా ఎక్కువ డిమాండ్ చేస్తుండటం విశేషం. ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రజినీకాంత్ నుండి రామ్ చరణ్ వరకు, అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సౌత్ ఇండియా స్టార్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..!

రజనీకాంత్ – రూ. 150 కోట్లు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ చాలా ఏళ్లుగా హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకునే హీరోల జాబితాలో కొనసాగుతున్నారు. 2007లో ‘శివాజీ’ చిత్రానికి గాను రూ. 26 కోట్లు అందుకుని, అప్పటికి అత్యధిక పారితోషికం పొందిన రెండో యాక్టర్ గా నిలిచారు. అయితే తలైవా ఇప్పుడు తన రాబోయే చిత్రం ‘జైలర్’ కోసం దాదాపు రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. 

కమల్ హాసన్ – రూ. 150 కోట్లు

విశ్వనటుడు కమల్ హాసన్ కూడా మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. కొన్నాళ్లుగా తన స్థాయికి తగ్గ విజయం అందుకోలేక రేసులో వెనుకబడ్డ యూనివర్సల్ స్టార్.. గతేడాది ‘విక్రమ్’ చిత్రంతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. హోమ్ బ్యానర్ లో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో, ఒక్కసారిగా కమల్ మార్కెట్ విస్తృతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తోన్న ‘ఇండియన్ 2’ సినిమా కోసం దాదాపు రూ. 150 కోట్లు వసూలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్ – రూ. 150 కోట్లు

‘బాహుబలి’ ప్రాంచైజీతో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. ప్రస్తుతం భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ హీరోగా మారిన డార్లింగ్.. తన క్రేజ్ కు తగ్గట్టుగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో టీ-సిరీస్ సంస్థ రూపొందిస్తున్న ‘ఆదిపురుష్’ మూవీ కోసం రూ.150 కోట్లు వసూలు చేశాడని టాక్ ఉంది. ఇదే కాకుండా సలార్, ప్రాజెక్ట్-కె, రాజా డీలక్స్, స్పిరిట్ చిత్రాలకు గాను భారీ పారితోషికం అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

విజయ్ – రూ. 150 కోట్లు

కోలీవుడ్ హీరో దళపతి విజయ్ దిల్ రాజు బ్యానర్ లో నటించిన ‘వారసుడు’ సినిమాకు 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ ఉంది. అయితే ఇప్పుడు ఒక్కో చిత్రానికి రూ. 150 కోట్లు వసూలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమాలో నటిస్తున్న విజయ్.. తన 66వ చిత్రం కోసం నూటా యాభై కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విక్రమ్ ప్రభు దర్శకత్వంలో ఏజీఎస్ సంస్థ ఈ సినిమాని నిర్మించనుంది. 

అల్లు అర్జున్ – రూ. 125 కోట్లు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు. దీంతో బన్నీ క్రేజ్ ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కు చేరిపోయింది. ఈ నేపథ్యంలో రెమ్యునరేష్ డబుల్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 1’ కోసం రూ. 45 కోట్లు తీసుకున్న బన్నీ.. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ & సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ‘పుష్ప 2’ కోసం రూ. 125 కోట్లు డిమాండ్ చేసినట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. 

రామ్ చరణ్ – రూ. 100 కోట్లు

RRR బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత, చిత్రంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్తా గ్లోబల్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో చెర్రీ హాలీవుడ్ ఫిలిం మేకర్స్ దృష్టిని ఆకర్శించారు. ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ గా ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత, చరణ్ తన రెమ్యునరేషన్ భారీగా పెంచాడని బాలీవుడ్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇంతకముందు రూ. 45 కోట్లు తీసుకున్న మెగా వారసుడు, ఇప్పుడు వంద కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ. దీని తర్వాత బుచ్చిబాబుతో చేయబోతున్న సినిమా కోసం హీరో రూ. 100 కోట్లు తీసుకోబోతున్నట్లు టాక్. 

ఎన్టీఆర్ – రూ. 80 కోట్లు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం RRR మూవీతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సినిమా భారీ విజయం సాధించడం, ఆస్కార్ వేదిక వరకూ వెళ్లొచ్చిన తర్వాత తారక్ బ్రాండ్ వాల్యూ బాగా పెరిగింది. ట్రిపుల్ ఆర్ కు దాదాపు రూ. 45 కోట్ల వరకూ తీసుకున్న ఆయన.. ఇప్పుడు ఒక్కో ప్రాజెక్ట్ కు రూ. 80 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ట్స్ & యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ లో కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు. ఇదే క్రమంలో KGF ప్రశాంత్ నీల్ తో ఓ భారీ యాక్షన్ మూవీ చేయనున్నారు. అలానే ‘వార్ 2’ సినిమాలో హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.